Saturday, July 5, 2008

దేవుడి జీవితంలో ఒక రోజు

అకస్మాత్తుగా దేవుడికి మెలకువ వచ్చింది. దిగ్గున లేచి కూర్చున్నాడు. “ఒక చిన్న కునుకు తీద్దామనుకుని చాలా సేపే నిద్ర పోయినట్టున్నా,” అనుకున్నాడు తనలో తాను. చుట్టూతా చూశాడు. దేవలోకంలో ఏమీ మార్పు లేదు. పచ్చిక బయళ్ళూ. సోగ కళ్ళ హరిణులూ, సెలయేరులూ, జలపాతాలూ అంతా మాములుగానే వున్నాయి.

ఒక్క సారి ఒళ్ళు విరుచుకుని గట్టిగా ఆవులిద్దాము అనిపించిది దేవుడికి. కాని వెంటనే అది ఎంత ప్రమాదమో గుర్తొచ్చింది. క్రితం సారి అలా చేసినప్పుడు భూలోకంలో జలప్రళయం వచ్చింది. సమస్త జాతి నశించడం వల్ల తిరిగి కొత్త సృష్టి చేయాల్సి వచ్చింది. మళ్ళీ కొన్ని కోట్ల ఏళ్ళ తరువాత ఒక కొలిక్కి వచ్చింది.

భూలోకం అనగానే దేవుడికి అనుమానం కలిగింది. “ఔను, తను నిద్రకి ఉపక్రమించడానికి ముందు భూలోకం పరిస్థితి ఎలా వుంది?” ఒక క్షణం తరువాత అంతా గుర్తొచ్చింది. మానవులు ఆటవిక స్థితి నుంచి బయటపడి, చిన్న సమాజాలు ఏర్పరుచుకుని సహజీవనం కొనసాగిస్తున్నారు.

“ఎంత ముచ్చటగా వుండేవాళ్ళో,” అనుకున్నాడు దేవుడు. ఒకరికొకరు తమ దగ్గరేది వుందో అది పంచుకునే వారు. ముసలి వాళ్ళకి రక్షణా, పిల్లలకి ఆలనా పాలనా కల్పించే వాళ్ళు. పెళ్ళి అనేది అప్పుడప్పుడే ఒక ఆచారం అయ్యింది. కొత్త విషయాలు అంటే ఆసక్తి. కొత్త కొత్త పనిముట్లు కనిపెట్టి తమ జీవితాన్ని మెరుగు దిద్దుకోవాలనే తపన. వాళ్ళు చక్రాన్ని మొదటి సారి కనిపెట్టినప్పుడు కొట్టిన కేరింతలూ, చేసిన నృత్యాలూ ఇంకా తనకు కళ్ళకి కట్టినట్టే వున్నాయి.

తనని తెలుసుకోవాలని వాళ్ళూ పడిన పాట్లు గుర్తొచ్చి దేవుడి పెదవుల మీద చిరు నవ్వు వెలసింది. పాపం! ఒక్కొక్కరిది ఒక్కో ప్రతిపాదన. తను కరుణా స్వరూపుడని ఒకరు వాదిస్తే, తప్పు చేస్తే శిక్షించడానికి మాత్రమే తను మేల్కొంటాడని ఇంకొకరు. ఐతే ఇంకా అప్పటికి ఒక నిర్దిష్టమైన మతం ఏదీ ఏర్పడలేదు.

వాళ్ళ గురించి తనకు చాలా ఆలోచనలు వుండేవి. వాళ్ళకి తగినన్ని సూచనలు ఇచ్చి వారిని సరి అయిన మార్గంలో వారంత వారే వెళ్ళేలా చెయ్యాలనీ, ఇంతకు ముందు సృష్టిలో జరిగిన పొరపాట్లు ఈ సారి జరక్కుండా చూసుకోవాలనీ, ఇంకా చాలా.

మరిప్పుడు ఎలా వున్నారో ఏమో? ఒక సారి తన దృష్టిని భూలోకం మీదికి సారించాడు దేవుడు. విపరీతమైన ఆశ్చర్యం కలిగింది ఆయనకి. తన నిద్రలో వేల సంవత్సరాలు దొర్లిపోయినట్టున్నాయి. భూలోకం పూర్తిగా మారిపోయింది. ఆకాశాన్ని అంటుకునేలా వున్న హర్మ్యాలూ, రక రాకాల యంత్రాలూ, ఎక్కడ చూసినా చీమల బారుల్లా జనం, పలు పేర్లతొ తనకి గుళ్ళూ గోపురాలూ.

ఐతే ప్రంపంచం చాలా అభివృద్ధి చెందిదన్న మాట. తన ప్రమేయం లేకుండానే మానవులు ఎంతో పురోగమించారు. చాలా ఆనందం వేసింది ఆయనకి. ఈ సంగతి ముందే తెలిస్తే ఇంకాసేపు నిద్ర పొయిండే వాడిని కద అనుకున్నాడు. “అసలు వీళ్ళు ఏమేం చేశారో ఇన్ని రోజులూ,” అన్న సందేహం కలిగింది ఆయనకి.

ఒక్క సారి తన దివ్య దృష్టితో గతంలోకి వెళ్ళాడు దేవుడు. ఆయన నొసలు ముడి పడింది. ఆయన మస్తిష్కంలో ఎన్నో దృశ్యాలు ఒక దాని తరువాత ఒకటి కదులుతున్నాయి. వాటిలో నచ్చనివే చాలా మటుకు.

మతం పేరుతో, కులం పేరుతో, భాష పేరుతో తమని తాము అనేక రకాలుగా విభజించుకున్నారు. భూమి కోసం, స్త్రీల కోసం, ధనం కోసం రక్త పాతం చిందించారు. అనవసరమైన పగలూ, కక్షలూ, కార్పణ్యాలూ పెంచుకున్నారు. రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఎన్నో రోగాలూ, మహమ్మారులూ కొన్ని కోట్లమందిని పొట్టన పెట్టుకున్నాయి.

ముఖ్యంగా ఇరవయ్యవ శతాబ్దంలో science అంత అభివృద్ధి చెందిందని ఆనందించాలో, ఎప్పుడూ జరగనంత అల్ల కల్లోలం ఆ వందేళ్ళలోనే జరిగిందని విచారించాలో అర్థం కాలేదు దేవుడికి.

తను ఎంతో శ్రద్ధ తీసుకుని సృష్టించిన అరణ్యాలూ, జంతు జాతి ఇంచు మించూ ప్రగతి పేరుతో పూర్తి గా హరించుకు పోయాయి. ఎటు చూసిన కాలుష్యం, మానవ నిర్మితాలైన కట్టడాలూ!

గత పదేళ్ళలో అయితే ఇంకా దారుణం ! తాము ఆది నుంచి నేర్చుకున్న ఎన్నో గొప్ప విషయాలు దాదాపు మర్చిపోయారు మానవులు. సనాతన సంస్కృతి నశించింది. అద్భుతమైన కళలు కొడి గట్టుకున్న దీపాల్లా అంతరించడానికి సిద్ధంగా వున్నాయి. నీతి నిజాయితి స్థానే, డబ్బు వుంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు అన్న అభిప్రాయానికి వచ్చేశారు వారు.

మానవ విలువలతో పాటు అనుబంధాలూ, ఆప్యాయతలూ కూడా నశించాయి. లౌక్యం పేరుతో మోసాలూ, చిరునవ్వు వెనుకాల వేరే వాడు బాగు పడిపోతున్నాడు అన్న అసూయా, ఒక సిద్ధాంతం నమ్ముకుని బతికే వాళ్ళని చూసి లోక జ్ఞానం లేని వాళ్ళని వెక్కిరించే లేకితనమూ అలవర్చుకున్నారు మానవులు.

ప్రేమ ఎప్పుడో నశించింది. ప్రబంధాల్లో, కవితల్లో తప్ప ఎక్కడా కనపడ్డం లేదు అది. అసలు చాలా మందికి ఆ పదాన్ని ఉచ్ఛరించే అర్హత కూడా లేదు. ప్రేమ పేరుతో పురుషులు కామాన్నీ, స్త్రీలు ఆర్థిక భద్రతనీ సంపాదించుకునే ప్రయత్నంలో వున్నారు.

బాధగా తల విదిలించాడు దేవుడు. “తను ఒక కునుకు తీసి లేచేసరికి ఇంత భయంకరంగా మారిపోయిందేమిటి ఈ లోకం? కనీసం దీన్ని బాగు పర్చడానికన్నా వీలవుతుందా,” అనుకున్నాడు విషాదం నిండిన హృదయంతో. అది సాధ్య పడే విషయం కాదనిపించింది ఆయనకి. తను ఈ ఆలోచనల్లో మునిగి వుండగానే మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం అవుతున్నారు మానవులు మళ్ళీ. తను సృష్టించిన జీవులు తన సృష్టినే అంతం చేయడానికి ఉబలాటపడుతున్నారు. అలా జరగనివ్వకూడదు.

తనకు ఆపాదింపబడిన శ్లోకం ఒకటి గుర్తొచ్చింది ఆయనకి. “యదా యదాహి ధర్మశ్యా గ్లానిర్భవతి భారతా.” కాని పరిస్థితి తను నిజంగా అవతారమెత్తినా బాగు పడదు.

నిర్లిప్తమైన నవ్వు ఒకటి తన అధరాల మీద లాస్యం చేస్తుండగా, ఒక్కసారి బద్ధకంగా ఒళ్ళు విరిచి ఆవులించాడు దేవుడు…

No comments: